టర్నోవర్ కాదు.. మా మార్జిన్లను చూడండి: UPI ఛార్జీలపై మోడీకి BJP లీడర్ లేఖ

టర్నోవర్ కాదు.. మా మార్జిన్లను చూడండి: UPI ఛార్జీలపై మోడీకి BJP లీడర్ లేఖ

దేశంలో కొత్తగా తీసుకొస్తున్న యూపీఐ మర్చంట్ ఛార్జీల విధానంపై వ్యాపార వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధురైకి చెందిన నాచియార్ డిజిటల్ సొల్యూషన్స్ ఫౌండర్, బీజేపీ సోషల్ మీడియా సెల్ జిల్లా అధ్యక్షుడు జేకే గోకుల్ బాలాజీ ఈ అంశంపై ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు. తాను ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కానప్పటికీ, చిన్న వ్యాపారుల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

లావాదేవీల విలువకు, వాస్తవ లాభానికి చాలా తేడా:
ప్రభుత్వం విధించే MDR ఛార్జీలను లెక్కించేటప్పుడు కేవలం టర్నోవర్ మొత్తాన్ని కాకుండా.. వ్యాపారికి మిగిలే అసలు మార్జిన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని బాలాజీ కోరారు. ఉదాహరణ రూ.77వేల 500 పెట్టి కొనుగోలు చేసిన లాప్‌టాప్‌ను రూ.80వేలకు అమ్మితే వ్యాపారికి వచ్చే మార్జిన్ కేవలం రూ.2వేల 500 మాత్రమేనని ఆయన తెలిపారు. అంటే దాదాపు 3 శాతం మార్జిన్ మాత్రమే లాభంగా వస్తోంది. దీనిలోనూ షాప్ రెంట్, కరెంట్ బిల్, ఉద్యోగులు జీతాలు లాంటి ఖర్చులు పోగా వచ్చేదే వ్యాపారికి మిగిలే లాభం అన్నమాట.

లాభంలో 12 శాతం ఛార్జీల రూపంలోనే పోతే ఎలా?
రూ.80వేల లావాదేవీ విలువపై గరిష్టంగా పడే రూ.300 ఛార్జీ పెద్దదిగా కనిపించకపోవచ్చునని.. కానీ ఆ లాప్‌టాప్ అమ్మటం ద్వారా వచ్చే రూ.2వేల 500 లాభంతో పోలిస్తే ఛార్జీ ఏకంగా 12 శాతంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క లావాదేవీపై ఇంత భారీ మొత్తంలో ఛార్జీలు పడితే చిన్న వ్యాపారులు ఎలా బతకాలని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆకాశాన్నంటే ఖర్చులు.. అరకొర మార్జిన్లు:
నెలవారీగా చూస్తే ఒక వ్యాపారి టర్నోవర్ రూ.10 లక్షలు ఉండవచ్చు. కానీ కొనుగోలు ఖర్చులు పోను వ్యాపారి చేతికి మిగిలే నికర మార్జిన్ కేవలం రూ.25వేల నుంచి రూ.40వేలు మాత్రమేనని బాలాజీ వివరించారు. ఈ స్వల్ప మొత్తంలోంచే వ్యాపారులు యూపీఐ MDR, కార్డ్ మెషీన్ ఛార్జీలు, జీఎస్టీ, అకౌంట్ మెయింటెనెన్స్, షాప్ అద్దె, కరెంట్ బిల్లులు, ఇంటర్నెట్, రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోందని లెక్కలతో సహా వివరించారు. 

చిన్న వ్యాపారులకు రక్షణ కావాలి:
తాము దేశ ఆర్థిక వృద్ధిని కాంక్షించేవారమని, స్వచ్ఛందంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని బాలాజీ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ నిర్వహణకు కూడా డబ్బు అవసరమని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. పెద్ద కంపెనీలు, హోటళ్లు, తయారీదారులకు రూ.300 ఛార్జీ పెద్ద భారంగా ఉండకపోవచ్చు కానీ తక్కువ ఆదాయంతో నెట్టుకొచ్చే చిన్న స్థాయి టెక్‌ ఎంట్రప్రెన్యూర్లకు ఇది తీవ్రమైన ఆర్థిక భారమని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న వ్యాపారులకు అండగా నిలవండి మోడీ జీ:
దేశంలో చిన్న వ్యాపారాలు విజయవంతంగా ఎదగాలని కోరుకునే ఒక సామాన్య పారిశ్రామికవేత్తగా ప్రధాని మోడీకి ఈ అభ్యర్థన చేశారు జేకే గోకుల్ బాలాజీ. కేవలం రూ.2వేలు పైన లావాదేవీలనే కాకుండా.. తక్కువ మార్జిన్లతో పనిచేసే మైక్రో చిన్న వ్యాపారుల జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని MDR నిబంధనలపై మరోసారి సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ నాయకుడు.