యూపీఐ ఛార్జీలపై ఓ పక్క సామాన్యులపై భారం పడుతుందని ప్రజలు , ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫాంల ప్రతినిధులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ ఛార్జీలను పెంచడం వల్ల డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింత బలపడుతుందని అంటున్నారు.
యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధానాన్ని కొందరు డిజిటల్ పేమెంట్ సంస్థల ప్రతినిధులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. పెరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పేమెంట్ మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని మోబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టాకు తెలిపారు. కొత్త విధానం ద్వారా బ్యాంకులు, పేమెంట్ సంస్థలపై ఉన్న ఆర్థిక భారం కొంత తగ్గి, యూపీఐ వ్యవస్థ మరింత సుస్థిరంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ కూడా MDR ఛార్జీలను సమర్థించారు. రోజుకు కోట్ల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్న క్రమంలో వచ్చే ఆదాయం మౌలిక సదుపాయాల నిర్వహణకు, యూపీఐ విస్తరణలో మరిన్ని పెట్టుబడులకు ఉపయోగపడుతుందని చెప్పారు.
అయితే ఈ ఛార్జీల ప్రభావం సాధారణ వినియోగదారులపై ఉండదని డిజిటల్ పేమెంట్ సంస్థలు చెబుతున్నాయి. రూ.2వేల వరకు లావాదేవీలకు ఎలాంటి MDR ఉండదు. రూ.2వేలకు మించిన కొన్ని మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. రూ.75వేలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 వరకు లిమిట్ ఉంటుంది.
ALSO READ : టర్నోవర్ కాదు.. మా మార్జిన్లను చూడండి
చిన్న వ్యాపారులకు కూడా MDR నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. పెద్ద వ్యాపారాలపై మాత్రమే ఈ ఛార్జీలు వర్తించేలా విధానం రూపొందించినట్లు చెప్పారు.ప్రభుత్వం కూడా MDRను కస్టమర్లపై మోపకూడదని స్పష్టం చేసింది.
