పురుగుల మందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రేమ జంట..

పురుగుల మందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రేమ జంట..
  •     బతికించాలంటూ తల్లితండ్రులకు ఫోన్
  •     హాస్పిటల్​లో మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు: పురుగుల మందు తాగి ప్రేమజంట ప్రాణం తీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుండాల బాలకృష్ణ, రాణిల పెద్ద కొడుకు రాము(25) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. వీరి కులాలు వేరు కావడం, అమ్మాయి మైనర్ కావడంతో ఇరువురి తల్లిదండ్రులు, గ్రామపెద్దలు పలుసార్లు హెచ్చరించారు. దీంతో తమ వివాహానికి  పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో గురువారం ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాముకు చెందిన మామిడి తోటలో తలదాచుకున్నారు. శుక్రవారం ఉదయం ఇరువురి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడంతో భయంతో అర్ధరాత్రి 12 గంటలకు పురుగుల మందు తాగారు. అనంతరం రాము తన తండ్రికి ఫోన్ చేసి తాము పురుగుల మందు తాగామని, తమను ఎలాగైనా బతికించాలని వేడుకున్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అతడి తల్లిదండ్రులు ఇద్దరిని ఉస్మానియాకు  తరలించారు. రాము శనివారం రాత్రి మృతి చెందగా, ఆదివారం ఉదయం బాలిక మృతిచెందింది.