మరణంతో ఒక్కటైన ప్రేమ జంట

మరణంతో ఒక్కటైన ప్రేమ జంట

యువతీయువకులు ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం సహజం. అయితే కొన్ని ప్రేమలు పెద్దల అంగీకారంతో సంతోషాన్ని నింపితే..మరికొందరి ప్రేమలు విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ప్రేమతో ఒక్కటి కాలేని ఓ యువతీ యువకులు మరణంతో ఒక్కటయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ లో జరిగింది.

రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ స్కూల్లో చదువుకునేప్పుడే ప్రేమించుకుంటున్నారు.  ప్రస్తుతం వీరిద్దరూ డిగ్రీ చదువుతున్నారు. శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి ఎంగేజ్ మెంట్ చేశారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా చేపట్టారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష, మహిపాల్.. పెద్దలను ఎదిరించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కరీంనగర్‌లో చదువుతున్న మహిపాల్‌ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకమయ్యారు.