న్యూఢిల్లీ/ముంబై: బెర్క్షైర్ హాత్వే అనుబంధ సంస్థ అయిన లూబ్రిజోల్ భారతదేశంలో 150 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.1,229 కోట్లు) పెట్టుబడి పెడుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెబెక్కా లైబర్ట్ తెలిపారు. భవిష్యత్తులో ఇండియాను తయారీ హబ్గా మార్చుకుంటామని స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే ఈ కంపెనీ ప్రకటించింది. తాము భారతదేశంలో ప్రస్తుతం స్థానిక అవసరాల కోసమే ప్రొడక్టులను తయారు చేస్తున్నామని, ఇక నుంచి ఎగుమతి మార్కెట్ కోసం కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫ్యూచర్ మొబిలిటీ, హెల్త్ బ్యూటీ, హోమ్ స్పేస్ సెగ్మెంట్లపైనా పనిచేస్తామని లైబర్ట్ చెప్పారు. భారతీయ కార్యకలాపాలలో భాగంగా, లూబ్రిజోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి లూబ్రికెంట్ల కోసం కెమికల్ యాడిటివ్స్ను తయారు చేయడానికి జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ఇందులో దీనికి మొదట్లో 50శాతం వాటా ఉండేది.
2017లో మరో 26శాతం కైవసం చేసుకుంది. 1966లో భారత్లోకి ప్రవేశించినప్పటి నుంచి దేశంలోనే లూబ్రిజోల్కు ఇదే అతిపెద్ద పెట్టుబడి అవుతుందని ఆమె చెప్పారు. గుజరాత్లోని విలాయత్లో క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) రెసిన్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించడానికి ఈ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఉపయోగిస్తామని అన్నారు. దహేజ్ యూనిట్ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేస్తారు. నవీ ముంబైలో గ్రీజు లేబొరేటరీ తెరుస్తారు. లూబ్రిజోల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ఏడాది చివర్లో విలాయత్లోని గ్రాసిమ్ సైట్లో లక్ష -మెట్రిక్-టన్నుల అత్యాధునిక సీపీవీసీ రెసిన్ ప్లాంట్ మొదటి దశను ప్రారంభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సీపీవీసీ రెసిన్ ఉత్పత్తికి ఇది అతిపెద్ద సింగిల్-సైట్ అవుతుంది. కంపెనీ దహేజ్ ప్లాంటు సీపీవీసీ సామర్థ్యాన్ని 140,000 మెట్రిక్ టన్నులకు పెంచుతారు. లూబ్రిజోల్ ఆర్ అండ్ డీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. లూబ్రిజోల్ రూ.1,229 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, దాని భారతీయ భాగస్వాములు ఈ సౌకర్యం కోసం భూమి, ఇతర ఆస్తులను అందజేస్తారు.