భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన పామేడు ఎల్వోఎస్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్లక్ష్మిని అరెస్టు చేసినట్టు భద్రాద్దరి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. చర్ల మండలంలోని తాలిపేరు డ్యాం వద్ద వెహికిల్స్చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బుజ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారించగా ఆమె మావోయిస్టు పార్టీ పామేడ దళ కమాండర్ అని తేలిందన్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్జిల్లా చర్పల్లికి చెందిన బుజ్జి 15 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారన్నారు. ఆమె నుంచి 3 కిలోల కెపాసిటీ ఉన్న స్టీల్క్యాన్, జిలిటెన్ స్టిక్స్, 5, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 సిరంజీలు , 4 బ్యాటరీలు , 80 మీటర్ల కార్డెక్స్, ఎలక్ట్రిక్ వైరు స్వాధీనం చేసుకున్నామన్నారు. చర్ల, దుమ్ముగూడెం, కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన పలు విధ్వంస ఘటనల్లో బుజ్జి కీలక పాత్ర వహించిందన్నారు. చర్ల పోలీస్స్టేషన్లో 10, దుమ్ముగూడెం పీఎస్లో 1, పామేడ్పరిధిలో 6, కిష్టారంలో 9, ఉసూర్, చింతగుప్ప పోలీస్ స్టేషన్లలో మొత్తం 30 కేసులు ఉన్నాయన్నారు.
