
పద్నాలుగేళ్ల పాటల వనవాసం తర్వాత ‘తిరిగి చూడు’ అనే పాటతో గీత రచయితగా తనకు పట్టాభిషేకం జరిగిందని చెబుతున్నారు మౌనశ్రీ మల్లిక్. ప్రముఖ పొలిటీషియన్ అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో బొమ్మకు మురళి తెరకెక్కించిన ‘ఇండియా ఫైల్స్’ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తిరిగి చూడు’ అనే పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మౌనశ్రీ మల్లిక్ ఇలా ముచ్చటించారు.
- 2010లో ‘చేతిలో చెయ్యేసి’ అనే సినిమా కోసం తొలిపాట రాశాను. ఈ పద్నాలుగేళ్ల కాలంలో రకరకాల మాధ్యమాల కోసం వెయ్యికి పైగా పాటలు రాశాను. ‘కోయిలమ్మ’ అనే సీరియల్ కోసం ఏకంగా 550 పాటలు రాశాను. ఎన్ని పాటలు రాసినా మౌనశ్రీ మల్లిక్ అంటే మంచి కవి అనే పేరు ఉంది కానీ నా పాట అంటూ చెప్పుకోవడానికి లేదు. అలాంటి గుర్తింపు ‘తిరిగి చూడు’ పాటతో వచ్చింది.
- పదివేల ఏళ్ల మానవ పరిణామ క్రమాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో చెప్పిన పాట కవిగా నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. ఇదొక జనం మెచ్చిన పాటగా నిలిచింది. వెయ్యి పాటల తర్వాత మేలిమి ముత్యంగా మెరిసింది. కీరవాణి గారు స్వయంగా పాడటం నాకు బోనస్ గిఫ్ట్. నాలోని కవిత్వాన్ని, విద్వత్తును, సామర్ధ్యాన్ని, నాకున్న సామాజిక అవగాహనను ప్రపంచానికి నివేదించిన పాట. మౌనశ్రీ మల్లిక్ అద్భుతమైన పాట రాశాడు అని ఆయన సభాముఖంగా చెప్పడం నా జీవితంలో మర్చిపోలేను. ఒక కొత్త రచయితను ఆదరించి, గౌరవించడం కీరవాణి గారి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ఈ పాటే నా సిగ్నేచర్గా మారింది. దీని తర్వాత 25 సినిమాలకు అవకాశం లభించింది. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన అద్దంకి దయాకర్ గారికి, దర్శకుడు బొమ్మకు మురళి గారికి ధన్యవాదాలు.
- వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని వ్యవసాయ కూలి కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి నా పేదరికాన్ని, ఆకలిని మరిపింపచేసింది పాట. రేడియోలో వచ్చే సినిమా పాటలు వినేవాడిని. చాలామంది ఉద్యమ గీతాలకు ప్రభావితులై రాస్తుంటారు. ఆశ్చర్యకరంగా నాకు సినిమా పాట గురువుగా మారింది. అక్షరాస్యత లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నాకు భాషపై సాధికారిత రావడానికి సినిమా పాటే కారణం.
- ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి గార్లను సినిమా పాటకు త్రిమూర్తులుగా అభివర్ణిస్తాను. ఆ తర్వాతి తరంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ గార్లను ఆ స్థానంలో భావించాను. వీరి పాటలు వినడం ద్వారా తెలుగు భాషలోని రమ్యత, సౌందర్యం తెలిశాయి. అలాగే భాషపై పట్టు, పాటపై మమకారం పెరిగాయి.
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఒకసారి వరంగల్లో చూశాక సినిమా పాటకు ఎంత క్రేజ్ ఉంటుందో అర్థమైంది. ఎప్పటికైనా నా పాటను బాలు గారు పాడాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఏ రంగంలోనైనా ప్రతిభ ఉంటే సరిపోదు. అత్యద్భుత ప్రతిభ ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందుకే భాషపై సాధికారిత పెంచుకునేందుకు, కవిత్వ ఊహాశక్తిని పెంచుకునేందుకు పదేళ్లు కృషి చేశాను.
- సి.నారాయణ రెడ్డి, కె.శివారెడ్డి, ఎన్.గోపి గార్ల కవిత్వ ప్రభావం నాపై చాలా ఉంది. నేను రాసిన దిగంబర, గరళం, తప్తస్పృహ, మంటల స్నానం వంటి కవితా సంపుటాలు ప్రచురించాక అనేక అవార్డులు వచ్చాయి. గొప్ప గొప్ప కవులతో వేదికలు పంచుకునే గౌరవాన్ని కవిత్వం నాకు ఇచ్చింది.
- శ్రీకాంత్ అనే మిత్రుడు ‘చేతిలో చెయ్యేసి’ (2010) అనే చిత్రం తెరకెక్కిస్తూ, మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. ఆపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న నాకు, 2016లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి ‘కోయిలమ్మ’ అనే సీరియల్ కోసం కాల్ వచ్చింది. దానికి పురాణ ఇతిహాసాలు, సంగీత, సాహిత్యాలపై పట్టు, భాషపై సాధికారిత ఉండి, వేగంగా పాటలు రాసే గీత రచయిత అవసరం. ఒక్క పాటతో మొదలై ఆ సీరియల్కు ఏకంగా 550 పాటలు రాశాను. ఆ తర్వాత చాలా సీరియల్స్కు రాశాను. ఇప్పటికీ సీరియల్ పాట అనగానే మొదట నా పేరునే సూచిస్తారు.
- కస్టమర్ ఏ వస్తువు అడిగితే అది ఇచ్చే సూపర్ మార్కెట్ ఓనర్లా లిరిక్ రైటర్ ఉండాలి. ప్రేమ గీతమా, విరహ గీతమా, హీరో పరిచయ గీతమా, ప్రత్యేక గీతమా అనేది కాదు. దర్శకుడు ఏం కోరుతున్నాడో అది రాసే సామర్ధ్యం ఉంటేనే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగుతాం. అలా ఎలాంటి పాట రాయడానికైనా నేను సిద్దం. ఇది నా ఆత్మ విశ్వాసమే కాదు.. నా చదువు, పాటపై నాకున్న నమ్మకం.
- నేను రాసిన పాటను బాలు గారు పాడాలని, కీరవాణి గారి సంగీతంలో పాట రాయాలని లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చా. అవి నెరవేరాయి. ఇక ఎప్పటికైనా చిరంజీవి గారి సినిమాకు పాట రాయాలనేది నా మూడో లక్ష్యం. త్వరలోనే అదికూడా నెరవేరుతుందని నమ్ముతున్నా.
- రమేష్ బాబు పమ్మి