బీజేపీ వదిలిన బాణం కవిత.. బతుకమ్మ పేరుతో బతుక నేర్చింది: మధుయాష్కీ

బీజేపీ వదిలిన బాణం కవిత.. బతుకమ్మ పేరుతో బతుక  నేర్చింది: మధుయాష్కీ
  • కేసీఆర్ తెలంగాణ పిత కాదు పిశాచి
  • కాంగ్రెస్ కు కవితను తీసుకునేంత దరిద్ర పట్టలే
  • స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండానే దోచేసిన సంస్థ జాగృతి
  • కవిత చిన్న లేడీ మాఫియా డాన్
  • ఆమె చేయని వ్యాపారం లేదు, స్కాం లేదు
  • తెలంగాణ రాకపోతే కవిత ఏపీ, తెలంగాణలో బ్యూటీ పార్లర్  పెట్టుకొనేవారు
  • కాంగ్రెస్  సీనియర్ నేత మధుయాష్కీ

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీజేపీ వదిలిన బాణమని, బతుకమ్మ పేరుతో బతుక నేర్చారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ డైరెక్షన్ మేరకే కవిత పనిచేస్తున్నారని, ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందని అన్నారు. అదే కోణంలో లేఖ అంశం తెరమీదకు తెచ్చారని చెప్పారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు మోదీతో సెల్ఫీలు దిగారని గుర్తు చేశారు. బీజేపీ వ్యూహరచనలో భాగంగానే కవిత ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.  జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ము ని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారన్నారు.  

కేసీఆర్ జాతి పిత కాదు తెలంగాణ పిశాచి అని విమర్శించారు. కవితను చేర్చుకునేంత దరిద్రం కాంగ్రెస్  పార్టీకి పట్టలేదని అన్నారు.  ఆమె నిజామాబాద్ జిల్లాల్లో జీఎస్టీ స్కాంలకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 800 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే డ్రామా ఆడుతున్నారని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా నిధులు దోచేశారని ఆరోపించారు. జాగృతి ఓ అవినీతి సంస్థ అని అన్నారు. కవితకు కేసీఆర్ జాతిపిత కావచ్చనని, తెలంగాణకు ఆయన పిశాచి అని అన్నారు. కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అని ఆరోపించారు. 

ఆమె చేయని వ్యాపారాలు లేవన్నారు. చేయని స్కాంలు లేవని అన్నారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న కవితకు కోట్ల విలువ చేసే బిల్డింగ్స్ బంజారా హిల్స్ లో ఎక్కడి  నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బంజారా హిల్స్ లో ఆమెకు రూ. 2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని అన్నారు. చెట్ల పేరుతో సంతోష్​ కోట్ల రూపాయల స్కాం చేశారని అన్నారు. ఆయన ఇప్పుడెందుకు మొక్కలు  నాటడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోటు దొంగలని వాళ్ల స్కాంలపై విచారణ జరిపించాలని అన్నారు.  

అలాంటి వారిని శిక్షించే వారు నిద్ర పోకూడదని చెప్పారు. కేటీఆర్ కి అమెరికా లో పెట్టుబడులు ఉన్నాయని, అవి చూసుకొని రావడానికి వెళ్ళారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మొజాంజాహీ మార్కెట్ లో పూలు అమ్ముకునేవారన్నారు. కవిత తెలంగాణ తో పాటు ఏపీ లో బ్యూటీ పార్లర్ పెట్టుకునేవారని అన్నారు.