- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వందేండ్ల విధ్వంసం: మధుయాష్కీ
ఉప్పల్, వెలుగు: కేటీఆర్ గులాబీ షర్ట్ వేసుకున్న దొంగల ముఠా నాయకుడని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వందేండ్ల విధ్వంసం చేశారని విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో ఏర్పాటు చేయనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) కార్యాలయ స్థలాన్ని మంగళవారం డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్, ఉప్పల్ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డితో కలిసి మధుయాష్కీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో ఎంఎంసీ కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే కార్యాలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గత ప్రభుత్వం బల్దియా నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించిందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని విమర్శించారు.
