కేసీఆర్‌‌కు కలలో కూడా బండి సంజయ్ కనిపిస్తున్నారు

కేసీఆర్‌‌కు కలలో కూడా బండి సంజయ్ కనిపిస్తున్నారు

సీఎం కేసీఆర్ పిరికివాడు అంటూ మండిపడ్డారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇంత పిరికి సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే సంస్కారం కూడా కేసీఆర్‌‌కు లేదన్నారు శివరాజ్‌ సింగ్. ఉద్యమిస్తే భయపడి దౌర్జన్యంగా జైల్లో వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజల గొంతుకను వినిపిస్తున్న బీజేపీని అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్‌‌కు నిద్రలో కూడా బండి సంజయ్‌ కనిపిస్తున్నారని అన్నారు.  కేసీఆర్ రాక్షస పాలనపై రాష్ట్ర బీజేపీ శాఖ చేస్తున్న  పోరాటానికి మద్దతిచ్చేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. బండి సంజయ్ పోరాటాలకు భయపడే కేసీఆర్ ఆయనను అరెస్ట్ చేయించారని అన్నారు.

 కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను అంతం చేసే వరకూ బీజేపీ కార్యకర్తలు కొట్లాడుతారని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీలు ఝలిపిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ తినడానికి బీజేపీ ఏం బిర్యానీ కాదని, కడుపు చించుకుని బయటపడే పోరాటయోధులమని చెప్పారు. కేసీఆర్ సర్కారును కూల్చేవరకూ విశ్రమించబోమన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయితే.. తాను నాలుగోసారి సీఎంనని.. ఆయనలా సంస్కారహీనంగా వ్యవహరించలేనన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతోందని, అన్ని వర్గాల వారినీ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని, కానీ తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో వారికి మాత్రమే పదవులు దక్కుతున్నాయని ఆయన అన్నారు.