
ఈ నెల 3న మహాధర్నా
1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం
బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ఆరోపించింది. ఈ నెల 3న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 1969 ఉద్యమకారులతో మహాధర్నా చేపట్టనున్నట్లు సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు తెలిపారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నాటి ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు పోలీస్ తూటాలకు బలయ్యారన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నాటి ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ఉద్యమకారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఉద్యమకారులు ఉచిత వైద్య సౌకర్యం, ఉచిత బస్ పాస్, గృహ వసతి కల్పించాలని, 369 మంది ఉద్యమకారుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సంఘం ఉపాధ్యక్షులు వనం చంద్రమౌళి, కె. మోహన్ రావు, రచ్చ సుభద్రారెడ్డి, ఎ. వెంకటయ్య, కె. బాలయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.