మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ శివసేనల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం రెండు పార్టీలు పట్టువీడటం లేదు. రిజల్ట్స్ వచ్చి వారం రోజులు దాటినా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. దీంతో అసహనం చెందిన ఓ రైతు తనను సీఎం చేయాలంటూ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యర్ కు లేటర్ రాశారు.
రెండు పార్టీల మధ్య విభేదాలు పరిష్కరించే వరకు తనను ముఖ్యమంత్రిగా చేయాలని బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడాలే రైతు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 31 తేదీన బీడ్ జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నర్ కోశ్యర్కు లేఖ రాశారు . మరాఠీలో రాసిన ఈ లేఖలో, అకాల వర్షాల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని, అందువల్ల రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్రానికి ప్రభుత్వం త్వరగా అవసరమని తెలిపారు. ఎవరో ఒకరు అధికారం చేపట్టకపోతే గవర్నర్.. తనను సీఎం చేయాలని కోరారు.
మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ సీట్లు 288. ఈ ఎన్నికలలో బీజేపీ(105)-శివసేన(56) కూటమి సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకుంది.