NEET మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతుర్ని చచ్చేవరకు కొట్టిన తండ్రి !

NEET మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని.. కూతుర్ని చచ్చేవరకు కొట్టిన తండ్రి !

బోర్డ్ ఎగ్జామ్.. లేదా మెయిన్ ఎంట్రెన్స్ లలో తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ మందలిస్తుంటారు.. కొందరు కొడుతుంటారు కూడా.. కానీ కేవలం మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని కన్న కూతురుని చచ్చేలా కొట్టాడు ఓ తండ్రి. కూతురి ప్రాణం కంటే మార్కులు.. ప్రెస్టేజ్ ఎక్కువైంది అతనికి.. ఘోరంగా విచక్షణ మరిచి కొట్టడంతో వందేళ్ళ భవిష్యత్తు ఉన్న ఆ అమ్మాయి చనిపోయింది. 

ఈ ఘటన మహారాష్ట్రలో సంగి జరిగింది.  కూతురుకి NEET మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని అత్యంత క్రూరంగా కొట్టాడు ఆ తండ్రి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సాధన అనే 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే సమయంలో నీట్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. అయితే మాక్ టెస్టులో తక్కువ మార్కులు రావటం తండ్రి సహించలేకపోయాడు. అందరికి ఏమని చెప్పుకోను.. నా మొహం ఎక్కడ పెట్టుకోను.. అని ప్రెస్టేజ్ గురించి ఆలోచించాడు. కానీ ఆ చిన్నారి పసి హృదయం ఎంత విలవిలలాడుతుంది అని ఆలోచించలేకపోయాడు. మార్కులు ట్యాలెంట్ కు కొలమానం కాదన్న సంగతి మరిచి గొడ్డును బాదినట్లు బాదాడు. 

దొండిరాం భగవాన్ భోసాలే శుక్రవారం (జూన్ 20) పెద్ద కట్టెతో విచక్షణ రహితంగా.. క్రూరంగా కొట్టడంతో సాధన తీవ్రంగా గాయపడింది. చాలా రక్తస్రావం అయ్యింది. రాత్రంగా గాయాలతో నిద్రకూడా పోలేదంట ఆ అమ్మాయి. తెల్లవారిన తర్వాత తల్లి ప్రీతి భోసాలె తన కూతురుని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఇన్ని గాయాలకు చికిత్స చేయలేం.. మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది.. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారట అక్కడి వైద్యులు. 

జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నరాలు చిట్లి పోయి అంతర్గతంగా  రక్తస్రావం జరగటంతో సాధన చనిపోయినట్లు చెప్పారు. కూతురు చనిపోవడంతో ఆమె తల్లి ప్రీతి భోసాలె.. తన భర్త మీద కేసు పెట్టినట్లు తెలిపారు. 

సాధన 10వ తరగతిలో 95 శాతం మార్క్స్ సాధించిందని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. డాక్టర్ కావాలని గోల్ పెట్టుకుందట. అయితే నీట్ క్లియర్ చేసి డాక్టర్ అవ్వాలని ఫ్యామిలీ ఆశపడింది. కానీ మార్క్స్ తక్కువ వచ్చాయని తండ్రే కిరాతకంగా చచ్చేదాక కొట్టాడని ఆమె చెప్పింది. ప్రీతి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి ఆ కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ప్రెస్టేజ్ కోసమో.. నలుగురు ఏమనుకుంటారో అనో.. పిల్లలను మెషిన్లుగా చూసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కొందరు తమ లక్ష్యాలను పిల్లలపై రుద్దుతారు. తాము సాధించలేనిది పిల్లలు సాధించాలని కలలుగంటారు. ఇలాంటి వాళ్లతోనే ఈ సమస్య. పరువు కోసం.. పొరుగు వారి కోసం.. బంగారం లాంటి పిల్లలను హింసించకండి. వాళ్ల ఇష్టాలు,.. అభిరుచులు, లక్ష్యాలు ఏంటో తెలుసుకుని ప్రోత్సహించండి. సరిగ్గా రాణించకుంటే వాళ్లకు ఇష్టమైన రంగంలో.. ఇష్టమైన పని చేసేలా ప్రోత్సహించండి. కానీ చంపకండి.