డీల్ ఫిక్స్.. మ‌హారాష్ట్రలో 18 సీట్లల్లో కాంగ్రెస్ పోటీ!

డీల్ ఫిక్స్..  మ‌హారాష్ట్రలో 18 సీట్లల్లో  కాంగ్రెస్ పోటీ!

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ డీల్ కుదిరింది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ18 చోట్ల పోటీ చేయనుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మాజీ  సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన 20 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం. కాంగ్రెస్‌ 18, శరద్‌పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ థాకరే, శరద్ పవార్‌లను సంప్రదించిన తర్వాత ఈ ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తో్ంది  దీనిపై మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. 

ఇక ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ సీట్లకు గానూ17 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ కు ఆఫర్ చేసింది. ఢిల్లీలోని ఏడింటిలో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. నాలుగింటిలో ఆప్ పోటీ చేయనుంది. అలాగే గుజరాత్‌లో రెండు చోట్ల ఆప్‌, చండీగఢ్‌లోని ఏకైక స్థానానికి కాంగ్రెస్‌, గోవాలోని రెండు సీట్లలో చెరోచోట పోటీకి అవకాశాలున్నాయి. ఇక బెంగాల్‌లోని 42 సీట్లు ఉండగా.. అందులో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. కాగా.. ఐదు సీట్ల వరకు పోటీ చేసేందుకు మమతా అంగీకారం తెలిపింది.