ఆర్టీసీ బస్సు టాప్ లేచిపోయింది..అయినా ఆగని డ్రైవర్..

ఆర్టీసీ బస్సు టాప్ లేచిపోయింది..అయినా ఆగని డ్రైవర్..

ఆర్టీసీ బస్సు 60 స్పీడ్ లో పోతోంది. ప్రయాణికులతో బస్ నిండిపోయింది. ఒక్కసారిగా బస్ రూఫ్ లేచిపోయింది. సగానికి పైగా విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్లు ఆర్తనాదాలు చేశారు. ఆపండి..ఆపండి..అంటూ అరిచారు. అయినా డ్రైవర్ వినిపించుకోలేదు. నేను మోనార్క్ ను..ఎవరి మాట విననంటూ అలాగే ..అంతే స్పీడ్ లో బస్సును పోనిచ్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 

మహారాష్ట్రలో అహేరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  గడ్చిరోలి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తోంది. కొద్ది దూరం వెళ్లాక బస్సు టాప్ సగానికి పైగా విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ డ్రైవర్ మాత్రం ఇసుమంతైనా భయపడలేదు. అలాగే పోనిచ్చాడు.  ఈ బస్సుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. దీంతో వైరల్ అయింది. ఈ ఘటనపై  అధికారులు విచారణకు ఆదేశించారు. 

చర్యలు తప్పవు..

బస్సు రూఫ్ విరిగిపోయిన  ఘటనపై MSRTC వైస్‌ ఛైర్మన్ శేఖర్‌ ఛన్నే స్పందించారు. గడ్చిరోలీ- అహేరీ మధ్య నడిచే ఆర్టీసీ బస్సు పై భాగం ఊడినా.. అలాగే నడిపించిన ఘటన తమ  దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై  విచారణకు ఆదేశించామని... ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. 

డ్రైవర్ కు తెలియలేదు..అందుకే..

బస్సు పైభాగం మొత్తం ఊడిపోలేదని..కేవలం ముందుభాగంలోనే ఫైబర్ విరిగిపోయిందని అహేరి డిపో అధికారులు తెలిపారు. అయితే ఈ విషయం డ్రైవర్, ప్రయాణికులకు తెలియలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇతర వాహనదారులు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.