వేములవాడలో 7 నుంచి మహాశివరాత్రి పూజలు

వేములవాడలో 7 నుంచి మహాశివరాత్రి పూజలు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. 7న రాత్రి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. మహాశివరాత్రి రోజు (8న) తెల్లవారుజామున 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు.

3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళవాయిద్యాల ప్రదర్శన, 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ ఉంటుంది. 8:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం, 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన, రాత్రి 11.35 నిమిషాలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు.