మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా పోలీస్ ఆఫీసర్లు బాధ్యతయుతంగా పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో అదనపు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని, అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని సూచించారు.
మక్తల్(నారాయణపేట): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నారాయణపేట ఎస్పీ వినీత్ ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. అక్రమంగా నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు సరఫరా జరగకుండా చూడాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివ శంకర్, రాంలాల్, సైదులు, భగవంత్ రెడ్డి పాల్గొన్నారు.
