- జూబ్లీహిల్స్లో 40 తులాలు,
- బంజారాహిల్స్లో 20 తులాల గోల్డ్ చోరీ
జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ పీఎస్పరిధిలోని ఓ ఇంట్లో పని మనుషులు ఏకంగా 40 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు. రోడ్ నెం. 2లో ఉన్న జూబ్లీ బాల్ పార్క్ అపార్ట్మెంట్లో మహ్మద్ తమీమ్ (32) అనే వ్యాపారి ఉంటున్నాడు. పత్రిక ప్రకటన ద్వారా యూసఫ్గూడకు చెందిన ఫెహ్మిదా బేగం (55)ను ఈ నెల 7 నుంచి పనిలో పెట్టుకున్నాడు.
ఏప్రిల్ 9న సాయంత్రం కుటుంబసభ్యులు బయటకు వెళ్లిన టైంలో ఫెహ్మిదా బేగం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఏప్రిల్ 11న కూఅత్యవసర కారణం చెప్పి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఈ నెల 24న ఇంటి అల్మారాను తనిఖీ చేసినప్పుడు సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు గల్లంతైనట్లు బాధితులు గుర్తించారు. వీటిలో రూబీ, ఎమరాల్డ్ రాళ్లతో కూడిన నెక్లెస్ సెట్, డైమండ్ నెక్లెస్, చిన్నా-పెద్ద నెక్లెస్ సెట్లు, చైన్తో కూడిన బంగారు గొలుసు, ఆరు బంగారు గాజులు, బ్రేస్లెట్, వివిధ రకాల ఉంగరాలు ఉన్నాయి. మొత్తం ఆభరణాల విలువ రూ.60 లక్షలకు పైనే ఉంటుందని బాధితులు తెలిపారు. ఫెహ్మిదా బేగంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
- బంజారాహిల్స్లో ఇద్దరు..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. రోడ్ నంబర్11లోని స్టోన్ ఏకర్ కాలనీలో విజయ ఎస్ నాయక్ (67) ఉంటోంది. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు ఇంటి మొదటి అంతస్తులోని డ్రెస్సింగ్ రూమ్లోని చెక్క అల్మారాలో ఉంచిన ఆభరణాలు కనిపించలేదు.
ఇందులో రెండు బంగారు గొలుసులు, వజ్రాల బ్రేస్లెట్, జత బంగారు-రూబీ చెవిపోగులు, కుందన్ పెండెంట్, బంగారు-రూబీ గాజు, పొడవైన బంగారు గొలుసు, కోరల్ ఫిలిగ్రీ నెక్లెస్, ఆరు బంగారు గాజులు ఉన్నాయి. సుమారు 20 తులాల బంగారం ఉంటుందని, వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఇద్దరు పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు
చేస్తున్నారు.

