డబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్​ రావు

డబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్​ రావు
  • బీఆర్ఎస్​ కౌన్సిలర్​పై మెదక్​ ఎమ్మెల్యే ఫైర్​ 
  • హరీశ్​రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు
  • గరంగరంగా మెదక్​ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్​

మెదక్, వెలుగు: డబ్బుకు అమ్ముడు పోయిన నువ్వా నన్ను ప్రశ్నించేది అని మెదక్​ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు 5వ వార్డు బీఆర్ఎస్​ కౌన్సిలర్​మామిళ్ల ఆంజనేయులు మీద ఫైర్​అయ్యారు.  చైర్మన్​చంద్రపాల్​అధ్యక్షతన మంగళవారం జరిగిన మెదక్​ మున్సిపల్​బడ్జెట్ మీటింగ్ గరం గరంగా సాగింది. మీటింగ్​లో మున్సిపల్​ వైస్​ చైర్మన్​ మల్లికార్జున్​గౌడ్, ఎమ్మెల్యే రోహిత్ మధ్య స్కీమ్​ల మీద చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా కౌన్సిలర్​ఆంజనేయులు లేచి ఇది బడ్జెట్​మీటింగ్​అనుకున్నారా? లేదా?  రాజకీయ వేదిక అనుకున్నారా అని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ 'పైసలకు అమ్ముడు పోయిన నువ్వా నా గురించి మాట్లాడేది' అని మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్​ను తిట్టిన నువ్వు పది లక్షలు ఇవ్వనందుకు అమ్ముడు పోయినవు అని ఆరోపించారు.  వయసుకు మర్యాద ఇస్తున్నా.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదన్నారు. 

మెదక్ అభివృద్ధిని అడ్డుకోమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు చెంచాలను పంపిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోహిత్​, కౌన్సిలర్​ఆంజనేయులు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్​ అంటున్నారు కానీ ఏమైనా పనులు అవుతున్నాయా అని ఎమ్మెల్యే కౌన్సిలర్లను ప్రశ్నించారు. పదేండ్లుగా మీ ఎమ్మెల్యే, మీ గవర్నమెంటే కదా ఉన్నది అప్పుడెందుకు నిధుల గురించి, పనుల గురించి మున్సిపల్ మీటింగ్​లో మాట్లాడలేదని నిలదీశారు. తాను మెదక్ ప్రజల అభిమానంతో గెలిచానని, పట్టణ అభివృద్ధికోసం, ప్రజల కోసం సేవచేస్తానన్నారు. 

రూ.50.91 కోట్ల బడ్జెట్​కు ఆమోదం

2024--, 25 ఆర్థిక సంవత్సరానికి రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్​కు మున్సిపల్​ కౌన్సిల్​ ఆమోదం తెలిపింది. టాక్స్​లు, అద్దెలు, పర్మిషన్లు, ఇతర పద్దుల ద్వారా 50 కోట్ల 91 లక్షల 50 వేల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. వివిధ అవసరాలకు 50 కోట్ల 89 లక్షల 50 వేల రూపాయలు వ్యయం అవుతుందని, 2 లక్షలు మిగులు బడ్జెట్​ను  కౌన్సిల్ ఏకగ్రీవంగా అమోదించింది.