అఫ్జల్ ​గంజ్​లో భారీ అగ్నిప్రమాదం .. మూడు అంతస్తుల బిల్డింగ్​ దగ్ధం

అఫ్జల్ ​గంజ్​లో భారీ అగ్నిప్రమాదం .. మూడు అంతస్తుల బిల్డింగ్​ దగ్ధం
  • మంటల్లో చిక్కుకున్న 10 మంది రెస్క్యూ 
  • 10 ఫైర్​ఇంజిన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • రెస్క్యూ ఆపరేషన్​లో కొత్త మినీ రోబో ఫైర్ ఫైటర్ వాడకం 

బషీర్​బాగ్, వెలుగు: అఫ్జల్ గంజ్ పరిధిలోని మహరాజ్​గంజ్​సిద్ధంబర్​బజార్ లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించి బిల్డింగ్​మొత్తం తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్​లోని 10 మందిని సేఫ్​గా బయటికి తీసుకొచ్చారు. మొత్తం 10 ఫైరింజిన్లను రప్పించి.. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పేపర్​ప్లేట్లు, డిస్పోజబుల్​గ్లాసులు విక్రయించే హోల్​సేల్​వ్యాపారి సునీల్ మాల్పానికి మహరాజ్​గంజ్​సిద్ధంబర్​బజార్ లో జీ+3 బిల్డింగ్​ఉంది.

 గ్రౌండ్​ఫ్లోర్ లోని షాపుల్లో డిస్పోజబుల్​గ్లాసులు, పేపర్​ప్లేట్లు విక్రయిస్తుండగా, మొదటి అంతస్తులో సరుకు నిల్వ చేస్తున్నాడు. రెండో అంతస్తులో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మూడో అంతస్తు ను ఓ కుటుంబానికి రెంట్ కు ఇచ్చాడు. కాగా, గురువారం ఉదయం 8 గంటల సమయంలో వ్యాపారి ఇంట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా మొదటి, మూడు అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగలు ఇల్లాంతా అలుముకోవడంతో ఉలిక్కిపడిన వ్యాపారి, కుటుంబ సభ్యులు మూడో అంతస్తుకు పరుగులు తీశారు. వారితోపాటు మూడో అంతస్తులో ఉండే కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 10 మంది మంటల్లో చిక్కుకుపోయారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్​ఇంజిన్లతో అక్కడికి చేరుకున్నారు. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ముందుగా బిల్డింగ్​లోపల చిక్కుకుపోయిన వారిని భారీ క్రేన్, స్కై లిఫ్ట్ సాయంతో సురక్షితంగా కిందికి దించారు. మంటల్లో చిక్కుకున్న వారిలో మూడు నెలల చిన్నారి, 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వారిని సేఫ్​గా బయటికి తీసుకురాగా, స్థానికులు చప్పట్లు కొడుతూ అభినందించారు.

 మొదటి అంతస్తు నిండా ప్లాస్టిక్​ఐటమ్స్​స్టోర్​చేసి ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మూడు అంతస్తులకు బిల్డింగ్​ముందు భాగంలోని గ్రిల్స్ కు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్​షీట్లు అంటుకోవడం మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైంది. రెస్క్యూ ఆపరేషన్ లో అగ్నిమాపక శాఖ కొత్తగా తీసుకొచ్చిన మినీ రోబో ఫైర్ ఫైటర్ ను ఉపయోగించారు. ప్రమాదానికి షార్ట్​సర్క్యూట్​కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం రూ.50 లక్షల లోపు ఉంటుందని బాధితులు వాపోయారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్​ను స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సందర్శించి, బాధితులను పరామర్శించారు. అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. 

మేడ్చల్ లో బస్సు దగ్ధం              

మేడ్చల్: మేడ్చల్ పీఎస్​పరిధిలో ఓ ప్రైవేట్​బస్సు దగ్ధమైంది. గురువారం సిద్దిపేట జిల్లా బండ మైలారం నుంచి కొంపల్లి వైపు వస్తున్న ప్రైవేట్​బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్​మేడ్చల్ ఐటీఐ వద్ద బస్సును పక్కకు తీసి ఆపాడు. క్షణాలో బస్సు దగ్ధమైంది. ఆ టైంలో బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైరింజిన్​చేరుకొని మంటలను ఆర్పివేసింది. మేడ్చల్ పోలీసులు కేసు ఫైల్​చేశారు.