యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలని కోరారు. బుధవారం (మార్చి 11) మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని.. యువత డ్రగ్స్కు బానిస కావద్దని సూచించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
మంత్రి వివేక్ కామెంట్స్:
- ఈ తరం యువతే రేపటి మన దేశ భవిష్యత్తు.
- మంచిగా చదివితేనే భవిష్యత్తు బాగుంటుంది.. దేశం బాగుపడుతుంది.
- సీఎం రేవంత్ రెడ్డి విద్యకే మొదటి ప్రయారిటీ ఇచ్చి యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.
- అందుకే ప్రతి నియోజకవర్గానికి రూ.250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం.
- 50 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం.
- ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవాటు పరుచుకోవాలి.. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.
- నేను చదువుకుంటున్న సమయంలో మా నాన్నగారికి చాయ్ పెట్టి ఇచ్చేవాడిని..
- మా నాన్న వెంట వచ్చిన స్నేహితులకు టీ ఇవ్వడమే కాకుండా.. కప్పు సాసర్లు కూడా కడిగే వాడిని..కిచెన్ శుభ్రం చేసేవాడిని.
- మా నాన్న స్నేహితులు ఎప్పుడూ నన్ను గుర్తుంచుకునేవారు.
- ఏ పనైనా ఇష్టంతో పని చేయాలి. ఒక బాధ్యత ఉండాలి.
