బల ప్రదర్శనకు రెడీ

బల ప్రదర్శనకు రెడీ
  •     ఇయాల్టి నుంచి హీటెక్కనున్న పాలిటిక్స్​ 
  •     ప్రచారంలో హోరెత్తించనున్న పార్టీలు 
  •     భారీ సభలు..అగ్రనేతల టూర్లకు ప్లాన్

మెదక్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల పాలిటిక్స్ మరింత హీటెక్కనున్నాయి. గురువారం ఎన్నికల నోటిఫికేషన్​వెలువడనుంది. నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ వరకు ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు మూడు ప్రధాన పార్టీల క్యాండిడేట్లు రెడీ అవుతున్నారు. అగ్రనేతల పర్యటనలు, భారీసభలు ఏర్పాటు చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. గెలుపే టార్గెట్​గా ప్రచారంలో ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటినుంచే మెదక్​ లోక్​సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ అభ్యర్థులను ఖరారు చేసి క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. 

నేడు బీజేపీ భారీ ర్యాలీ 

ఎన్నికల షెడ్యూల్​రాకముందు నుంచే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​ రావ్​ తన కార్యక్రమాలను ప్రారంభించారు. మెదక్​టికెట్​ తనకే వస్తుందన్న ధీమాతో ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగ్​లు నిర్వహించారు. టికెట్​ ఖరారయిన తర్వాత మరింత యాక్టివ్​ అయ్యారు. సెగ్మెంట్, మండల స్థాయి మీటింగ్​ లు కొనసాగిస్తూ క్యాడర్​ ను ఎన్నికలకు సిద్దం చేశారు. స్వయంగా వివిధ వర్గాల ప్రముఖులను, ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న 2,112 బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోఆర్డినేటర్​లతో మెదక్​ లో మీటింగ్ ఏర్పాటు చేశారు.

బూత్ కమిటీలు ఎలా పనిచేయాలి, బీజేపీ విధానాలను, మోడీ విజయాలను కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ వైఫల్యాలను ప్రజలకు ఎలా వివరించాలి అన్న విషయాల్లో బూత్​కమిటీలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే గురువారం నాడే రఘునందన్​ రావ్ నామినేషన్​ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బలాన్ని చాటేలా మెదక్​లో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్​ చేశారు. 

సీఎం సభకు కాంగ్రెస్​ ప్లాన్​ 

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్లలోని లీడర్ల మధ్య సమన్వయం కుదర్చడంతోపాటు చేరికలపై ఫోకస్​ పెట్టింది. బీఆర్ఎస్​, బీజేపీ లీడర్లు పెద్ద సంఖ్యలో చేరుతుండడం ఆ పార్టీలో జోష్​ పెరిగింది. బీఆర్​ఎస్​కు చెందిన నర్సాపూర్​ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మెదక్ మున్సిపల్​ చైర్మెన్​ చంద్రపాల్ తో పాటు పలువురు ఎంపీపీ, జడ్పీటీసీ మెంబర్లు, మాజీ ఎంపీపీ,జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్​లు , ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్​ లో చేరారు. కేసీఆర్​సొంత నియోజకవర్గమైన గజ్వేల్​నుంచి పలువురు సీనియర్​ బీఆర్​ఎస్​లీడర్లు

సంగారెడ్డి బీజేపీ ఇన్​చార్జి పులి మామిడి రాజు కూడా కాంగ్రెస్​ లో చేరారు. మెదక్ లోక్​ సభ ఎన్నికల ఇన్​చార్జి, మంత్రి కొండా సురేఖ పటాన్​ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ సెగ్మెంట్​లలో మీటింగ్​లు పెట్టి నాయకులకు, క్యాడర్​కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్​ సందర్భంగా మెదక్​ లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు భారీ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బహిరంగసభ ఏర్పాటు చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. 

త్వరలోనే కేసీఆర్​ బస్సుయాత్ర

 లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్​లలో బీఆర్ఎస్ మీటింగ్​లు నిర్వహించింది. సిట్టింగ్​ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్​ హైకమాండ్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ మంత్రి హరీశ్​ రావ్ ఇప్పటికే నియోజకవర్గమంతటా పర్యటించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతోపాటు పార్టీ క్యాడర్​ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు బీఆర్​ఎస్ దేనని, తొందరపడవద్దని నచ్చచెప్తున్నారు.

బుధవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్​ పూర్​లో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్​ఎస్​ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​పాల్గొన్నారు. నామినేషన్ల అనంతరం నియోజకవర్గంలో కేసీఆర్​ బస్సుయాత్ర ఉంటుందని చెప్తున్నారు. బీజేపీ ​, కాంగ్రెస్​లకు ధీటుగా వెంకటరామిరెడ్డి నామినేషన్​ సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నారు.