పెళ్లి చేసుకున్న నోబెల్ గ్రహీత మలాలా

పెళ్లి చేసుకున్న నోబెల్ గ్రహీత మలాలా

బర్మింగ్‌హామ్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అసర్‌ మాలిక్‌ అనే యువకుడితో యూసఫ్‌జాయ్‌ వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్‌ను ఆమె నిఖా చేసుకున్నారు. ఈ వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. అసర్‌, నేను జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మాకు మీ ఆశీస్సులు కావాలి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని కలసి సాగించడానికి ఆతృతగా ఉన్నాం’ అని ట్విట్టర్‌లో మలాలా పోస్టు చేశారు. 

కాగా, పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబాన్లు మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి ఆమె మీద కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మలాలా ఎడమ కణితి, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌‌కు తరలించి చికిత్స అందించండంతో ప్రాణాలు నిలిచాయి. అయితే, బుల్లెట్ గాయాల కారణంగా మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్‌‌కు తరలించారు. పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. అప్పటి నుంచి ఆమె బ్రిటన్‌‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవ‌ల్ని గుర్తించి 2014లో ఆమెకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి పుర‌స్కారాన్ని అంద‌జేశారు. 17 ఏళ్ల అతిచిన్న వ‌య‌సులోనే  నోబెల్ అందుకున్న యువ‌తిగా మ‌లాలా గుర్తింపు పొందారు. 2020లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో ఆమె డిగ్రీ పట్టా పొందారు. 

మరిన్ని వార్తల కోసం: 

కరోనా సోకడంతో ఉరిశిక్ష వాయిదా

ఐసీడీఎస్​లో గ్రేడ్​-2 సూపర్​వైజర్లకు నోటిఫికేషన్

లంచం ఇవ్వలేదని భూములు లాక్కున్రు