ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్న మాలాశ్రీ కూతురు

ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్న మాలాశ్రీ కూతురు

ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాధనా రామ్ హీరోయిన్ గా పరిచయం కానుంది. 'ఛాలెంజింగ్ స్టార్' దర్శన్‌ హీరోగా D56 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె నటించనుంది. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. తొలి షాట్‌కు శ్రీ రవిశంకర్ గురూజీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాలలో కథానాయికగా మాలాశ్రీ నటించారు. అందం, అభినయంతో అశేష అభిమానులని సంపాదించుకున్న మాలాశ్రీ, లేడి ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ హీరోయిన్ గా పరిచయం కానుండటంతో ఆమె నటనపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్ వెంకటేష్ నా సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబయిలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది. నా కూతురిగానే కాకుండ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

రాధనా మాట్లాడుతూ..‘ఛాలెంజింగ్ స్టార్’తో తెరంగేట్రం చేయడం చాలా థ్రిల్‌గా ఉంది. ‘ఈ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నటి కావాలనుకున్నాను. అందుకే, నన్ను నేను తెరపై ప్రెజెంట్ చేయడానికి గత కొన్నేళ్లుగా చాలా సన్నాహాలు చేసుకున్నాను. ప్రేక్షకులు నా తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లే నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను'  అని అన్నారు.

D56 సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం బెంగుళూరులో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరగనుంది. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రాజ్, ఎడిటర్ కెఎం ప్రకాష్ సహా ‘రాబర్ట్’ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.