హైదరాబాద్, వెలుగు: జాతీయ పార్టీలుగా మారిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రం దాటి ప్రభావం చూపించలేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆ పార్టీలు బయట పోటీ చేసి గెలిచిందే లేదని చెప్పారు. ‘‘కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పార్టీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కానీ వాటితో అయ్యిందేమీ లేదు. డీఎంకే, అన్నా డీఎంకే సహా అనేక పార్టీలు జాతీయ పార్టీలుగా మారినా తమ రాష్ట్రం దాటి ప్రభావం చూపించలేదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న ఖర్గే.. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. శనివారం గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గాంధీయేతర కుటుంబం నుంచి ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. ఈ నెల 17న ఎన్నికలు ఉన్నాయి. నాకు మద్దతు ఇవ్వాలి” అని ఖర్గే కోరారు.