
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్ధించారు. ఈ ఘటన పై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల కిందటే తెరిచిన వంతెన పైకి ఒకేసారి అంతమందిని ఎలా అనుమంతించారో తేల్చాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని, గల్లంతైన వారి ఆచూకీ కోసం సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున గుజరాత్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 141 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. కేబుల్ బ్రిడ్జి ఘటన అనంతరం అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు.