కాంగ్రెస్ బాద్ షా ఎవరు?

కాంగ్రెస్ బాద్ షా ఎవరు?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యాలయంలో అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి  ఓట్లను లెక్కిస్తున్నారు.  ఎవరికైతే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో..వారినే విజేతగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ. దేశ వ్యాప్తంగా ఈనెల 17న అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ నిర్వహించింది కాంగ్రెస్. ఆయా రాష్ట్రాల పీసీసీ కార్యాలయంలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 9వేల మంది డెలిగేట్స్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక 25 ఏండ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తుల చేతుల్లోకి కాంగ్రెస్ పగ్గాలు వెల్లనుండటంతో కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనేది కాసేపట్లో తేలిపోనుంది. 

అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేతలు ఖర్గే, థరూర్ పోటీ పడ్డారు. అధిష్టానం నేరుగా ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించనప్పటికీ ఖర్గే వైపు గాంధీ కుటుంబం మొగ్గు ఉందని తెలుస్తోంది. దీంతో ఖర్గే విజయం ఖాయమని అంటున్నారు పార్టీ నేతలు. అయితే కార్యకర్తల బలం తనకే ఉందంటూ శశి థరూర్ మొదటి నుంచి చెప్తున్నారు. గెలుపుపై ఇద్దరు నేతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ్టి కౌంటింగ్ పై ఆసక్తి ఏర్పడింది. 

137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా 1950లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ్ దాస్ గెలిచారు. 1947 జరిగిన ఎన్నికల్లో సీతారామ్ కేసరి విజయం సాధించారు. 2000 సవంత్సరంలో జరిగిన ఎన్నికల్లో జితేంద్ర ప్రసాద్ పై సోనియా గాంధీ గెలిచారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లల్లో 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తొలిసారి 1998లో అధ్యక్షురాలైన సోనియా..19ఏండ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్.. 2019 వరకు కొనసాగారు. ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.