కిషన్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నరు : మల్లు రవి

కిషన్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నరు : మల్లు రవి
  • సీఎం రేవంత్‌‌ది అక్రమ సంపాదన అనడం విడ్డూరంగా ఉంది 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ కిషన్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకమని, అందుకే ప్రజలు ఆయనను నమ్మారని చెప్పారు. రేవంత్‌‌ది అక్రమ సంపాదన అని కిషన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ అధికార పార్టీలో లేరన్నారు. 

కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తుచేశారు. పదేండ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే విచారణ జరిపించడానికి ఉన్న అడ్డంకులేంటని నిలదీశారు. కేసీఆర్‌‌‌‌ను కాపాడింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవితపై లిక్కర్ కేసు ఆరోపణలు వస్తే అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరని అడిగారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.