జడ్చర్ల టౌన్, వెలుగు: ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం రేవంత్రెడ్డికి అందించానని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో రవి మాట్లాడారు. తనకు నాగర్కర్నూల్ లోక్ సభ సీటు ఇవ్వడానికి ఉదయ్పూర్ డిక్లరేషన్ అడ్డం వస్తున్నదని భావించే రాజీనామా చేశానని చెప్పారు. హైకమాండ్తో చర్చించి తన రాజీనామాను ఆమోదించాలని కోరానని వెల్లడించారు.
ఇదే విషయాన్ని రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి సైతం తెలిపానన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి నేను సహకరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశా. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో నా వంతు పాత్ర పోషించాను. ఈ నేపథ్యంలో కొంత మంది ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఉంది కదా.. మల్లుకు టికెట్ ఎందుకు? మాకు అవకాశం ఇవ్వండని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి పోటీ చేసేందుకు వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి సీఎంకు అందజేశాను” అని రవి తెలిపారు.