ప్రాణ భయం లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఆస్తి పోయింది!

ప్రాణ భయం లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఆస్తి పోయింది!

ప్రాణ భయం లేకుండా చూసుకోవాన్న ఆలోచనతో తన ఆస్తిని నాశనం చేసుకున్నాడు. సేఫ్టీ కోసం చేసిన ప్రయత్నంలో రూ.13.5 కోట్ల విలువైన భవనాన్ని బూడిదపాలు చేసుకున్నాడు. పాముల బెడదను తట్టుకోలేక అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఈ పని చేశాడు.

అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తికి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1.8 మిలియన్ డాలర్ల (సుమారు 13.5 కోట్లు) విలువైన ఇల్లు ఉంది. అయితే ఆ ఇంట్లోకి తరచుగా పాములు వస్తుండడంతో ప్రాణ భయంతో గడపాల్సి వస్తోంది. దీంతో ఇంట్లో పొగబెట్టి.. పాములను బయటకు పంపేయాలని అనుకున్నాడు. దీని కోసం ఇంట్లో అక్కడక్కడా భారీగా బొగ్గును పేర్చి, నిప్పు పెట్టాడు. కానీ పొరబాటున ఆ బొగ్గును కర్టెన్లు లాంటి వాటికి బాగా దగ్గరగా పెట్టడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు దాదాపుగా కాలిపోయింది. ఈ ఘటనలో మనుషులెవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇంతటి భారీ ఆస్తి నష్టాన్ని ఊహించని ఆ ఇంటి ఓనర్‌‌ బోరున విలపించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మాంట్‌గోమెరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ చీఫ్​ స్పోక్స్‌పర్సన్‌ పెటె పిరింజర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.  దీనిని చూసిన నెటిజన్లు ఓనర్ మరేదైనా పద్ధతిలో పాముల బెడదను వదిలించుకోకుండా ఇలా ఇంట్లో నిప్పు పెట్టే ఆలోచన ఎందుకు చేశాడో అంటూ కామెంట్లు చేస్తున్నారు.