
ఎంటర్ టైన్ మెంట్ గేమ్ పబ్జీ ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికే వందలాది మంది పబ్జీగేమ్ మాయలోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనల్ని మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ గేమ్ హత్యకు దారితీసింది.
గేమ్ ఆడే సమయంలో ఉత్సాహం ఎక్కువై కేకలు వేయడం కామన్. అలా కేకలు ఎందుకు వేస్తున్నారంటూ అడిగిన పాపానికి ముగ్గురు యువకులు ఓ వ్యక్తి ప్రాణం తీశారు.
జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పు బద్వాల్ ఖాజియాన్ గ్రామంలో దారుణం జరిగింది. రాజ్ కుమార్, బిక్రమ్ జీత్, రోహిత్ కుమార్ లు పబ్జీగేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే సమయంలో కేకలు వేస్తూ హంగామా చేశారు. ఆ కేకలపై అసహనం వ్యక్తంచేసిన దలీప్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతే పబ్జీ ఆడుతున్న ఆ ముగ్గురు బాధితుడిపై దాడి చేశారు. పక్కనే ఉన్న చెక్క తో తలపై కొట్టడంతో దలీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.