
ముంబై: కన్న తండ్రి కర్కశంగా తన బిడ్డలను చంపేయాలనుకున్నాడు. ఐస్క్రీమ్ పేరు చెప్పి పసిబిడ్డలను పొట్టనపెట్టకోవాలనుకున్నాడు. కన్న ప్రేమను మరిచిపోయి.. ఎలుకల మందు కలిపిన ఐస్క్రీమ్ను తన బిడ్డలకు ఇచ్చాడు. మహారాష్ట్రలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబై సమీపంలోని మంఖుర్ద్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అలీ నౌషద్కు అర్మాన్ (రెండేళ్లు), అలీషాన్ మొహమ్మద్ (ఐదేళ్లు), అలీనా (ఏడేళ్లు) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నౌషద్కు, అతడి భార్యతో గొడవలు నడుస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న కలహాలతో అతడు తన బిడ్డలను చంపేయాలనుకున్నాడు. దీంతో శుక్రవారం తన పిల్లలకు ఐస్క్రీమ్స్ తెచ్చి, వాటిలో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత చూసిన నౌషద్ భార్య తన పిల్లలను ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అలీషాన్ మొహమ్మద్ (5) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నౌషద్ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబంలో గొడవల కారణంగానే నౌషద్ పిల్లలను చంపే ప్రయత్నం చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.