హైదరాబాద్, వెలుగు: ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో యువతి కండ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసిన ఘటన ఎస్ఆర్నగర్లో సోమవారం జరిగింది. ఈ దాడిలో యువతి మెడ, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 28ఏండ్ల యువతి పదేండ్లుగా బోరబండ పరిధిలోని బంజారానగర్లో ఉంటున్నది. ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్లో హౌస్కీపింగ్గా పని చేస్తున్నది. బోరబండలోని మోతీనగర్కు చెందిన కిశోర్ షాపింగ్ మాల్లోనే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ ఆరేండ్లుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కిశోర్ ఆమె వెంటపడేవాడు. చాలాసార్లు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గొడవ పడ్డాడు. కొన్ని రోజుల కింద అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది.
ఇది తెలుసుకున్న కిశోర్, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. యువతిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం సాయంత్రం బాధిత యువతి ఇంటికెళ్తుండగా బంజారానగర్లో అడ్డుకున్నాడు. కండ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె మెడ, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కిశోర్ ని పట్టుకుని చితకబాదారు. అమ్మాయిని హాస్పిటల్కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. కిశోర్పై కేసు రిజిస్టర్ చేశారు. ప్రేమను నిరాకరించినందుకే దాడి చేసినట్లు కిశోర్ ఒప్పుకున్నాడని, మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని పోలీసులు వివరించారు.
