బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్

బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్

దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్న వేళ.. ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక వినూత్నమైన పిలుపునిచ్చారు. జీడీపీ వృద్ధి రేటు అద్భుతంగా 7.8% నమోదైన సందర్భంలో 'స్వదేశీ' మంత్రాన్ని జపించాలని కోరారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలు మానుకోవాలని సూచించడమే కాకుండా.. సామాన్యులకు అత్యంత ఇష్టమైన బంగారం కొనుగోళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనడం ఆపేయండి అంటూ ప్రధాని పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం మన దేశం ఎదుర్కొంటున్న వాణిజ్య లోటే. తాజాగా జూలై నెలలో భారత గోల్డ్ దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి ఏకంగా 4.16 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ.39వేల 520 కోట్లకు చేరాయి. దీనివల్ల మన దేశ వస్తువుల వాణిజ్య లోటు గత 6 నెలల గరిష్ట స్థాయి అయిన 31.98 బిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3లక్షల 3వేల 810 కోట్లకు పెరిగింది.  విదేశాల నుంచి మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ బయటకు తరలిపోతుండటమే దీనికి ప్రధాన కారణం.

కేవలం ఒక్క నెలలో బంగారం కోసమే సుమారు రూ. 40 వేల కోట్లు విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని భారతదేశం కోల్పోతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని, మన దేశంలో తయారయ్యే 'స్వదేశీ' ఉత్పత్తులను ప్రోత్సహిస్తేనే దేశ ఆర్థిక స్వయంసమృద్ధి సాధ్యమవుతుందని మోడీ అన్నారు. మరి బంగారం ప్రియులు ప్రధాని మాటను మన్నించి గోల్డ్ షాపింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ వేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.