యాదాద్రి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి 120 మంది లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందించడంలో గత సర్కార్ విఫలమైందన్నారు. తాము వాటిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించామన్నారు. మిగిలిన 324 ఇండ్లను త్వరలోనే అందిస్తామని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి-, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, హౌసింగ్ పీడీ అలివేలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
నెరవేరిన సొంతింటి కల
సింగన్నగూడెంలో బీఆర్ఎస్ హయాంలో 444 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. 2021లోనే ఈ ఇండ్లు పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో ఆ ఇండ్లకు ఉన్న కిటికీలు, డోర్లు చోరీకి గురయ్యాయి. ఎవరికీ కేటాయించకపోవడంతో పడావు పడి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు టైంలో హడావుడిగా 419 లబ్ధిదారులను ఎంపిక చేశారు. మౌలిక వసతులు లేకపోవడంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాటిల్లోకి లబ్ధిదారులు వెళ్లలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చొరవతో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2.55కోట్లు కేటాయించింది. 120 ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడంతో లబ్ధిదారులు సోమవారం గృహప్రవేశం చేశారు.
