భార్య కోసం పోతే  బామ్మర్దులు కొట్టిన్రని  ఆత్మహత్య​

భార్య కోసం పోతే  బామ్మర్దులు కొట్టిన్రని  ఆత్మహత్య​

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : భార్య కోసం అత్తారింటికి వెళ్లిన భర్తను బామ్మర్దులు చితకబాదారు. ఈ అవమానం భరించలేని అతడు సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం బొందల పల్లి గ్రామానికి చెందిన రాములు (38) భార్య నాగమ్మ రెండు రోజుల క్రితం రూ.1.10 లక్షలు తీసుకొని తల్లిగారి ఊరైన తాడూరు మండల కేంద్రానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న భర్త రాములు మంగళవారం అత్తారింటికి వెళ్లాడు. డబ్బులు తీసుకుని తనకు చెప్పకుండా ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరగడంతో బామ్మర్దులు జోక్యం చేసుకుని  రాములును చితకబాది ఇంట్లో నుంచి నెట్టివేశారు. దీంతో రాత్రి బస్టాప్‌‌లో పడుకొని ఉదయం ఇంటికి వచ్చిన రాములు కొడుకు మహేశ్‌‌‌‌కు జరిగిన విషయం చెప్పాడు. కొడుకును ఎద్దులను మేపేందుకు పంపించి... ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శవాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.