- వచ్చే రెండు నెలలూ వర్షాలు పడే పరిస్థితి లేదు
- గ్రౌండ్ వాటర్ మరింత లోతుకు పోయే చాన్స్
- ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలి
- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ ఎస్ఈ విష్ణు ప్రసాద్, డీఏవో సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రస్తుత ఖరీఫ్తో పాటు రానున్న రబీ సీజన్లోనూ నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మొదలు తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉందన్నారు. ఎకరా వరి పంటకు అవసరమయ్యే నీటితో 3 నుంచి 4 ఎకరాలలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వరినాట్లు వేస్తే పంటకు నీరు పూర్తిస్థాయిలో అందక ఎండిపోయే ప్రమాదం ఉంటుందని, దిగుబడి తగ్గడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందలు వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంచుకోవాలన్నారు. బోర్లపై ఆధారపడే రైతులు సైతం నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
