హైదరాబాద్, వెలుగు: ‘‘దళితబంధుపై బీఆర్ఎస్ బందిపోట్లు దాడి చేస్తున్నారు” అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మండిపడ్డారు. లబ్ధిదారుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఒప్పుకున్నారని, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం కళ్లు మూసుకుని కాపాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
అవినీతిపరులైన ఎమ్మెల్యేల జాబితాను సీఎం కేసీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కేసీఆర్.. లిక్కర్ కుంభకోణంలో కవిత, భూ కుంభకోణంలో కేటీఆర్ దోచుకుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అందినకాడికి లాగేస్తున్నారని మండిపడ్డారు. దళితబంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై గవర్నర్, ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతి ఎమ్మెల్యేలపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పీసీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేశ్
ప్రశ్నించారు.