
తెలంగాణలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు 2023, డిసెంబర్ 14వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యంగా కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి.. రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా అమ్రపాలి నియామకం ఆసక్తిగా మారింది. మిగిలిన ఐఏఎస్ ల వివరాల్లోకి వెళితే..
HMDA కమిషనర్ గా ఆమ్రపాలి నియమించారు. ఇరిగేషన్ సెక్రెటరీగా రిజ్వీ ని నియమిస్తూ ఆయనకు అదనంగా ట్రాన్స్ కో - జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్ కో జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జా, డిప్యూటీ సీఎం కు ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా కృష్ణ భాస్కర్ ను నియమించారు. TSSPDCL చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, TSNPDCL వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి,అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి.గోపిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.