
- బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది నుంచే ట్యాపింగ్
- మాజీ మంత్రులకు నోటీసులు.. మరికొన్ని కేసులు పెట్టేందుకు రెడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. ఫోన్ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్టు తెలిసింది. ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారో లెక్కకూడా తేలకపోగా.. ప్రతిపక్షంతో పాటు స్వపక్షంపైనా దీన్ని ప్రయోగించనట్టు బయటపడింది. అదే సమయంలో ఢిల్లీ పెద్దల కదలికలపైనా ట్యాపింగ్ అస్ర్తం ప్రయోగించినట్టు తాజాగా తేలింది. కేంద్ర మంత్రులు, వారికి దగ్గరగా ఉన్న ఆఫీసర్లు, వ్యక్తులపైనా ఫోన్ ట్యాపింగ్ గురి పెట్టినట్టు పోలీసు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అధికారిక ప్రొసీజర్ ఫాలో కాకుండానే.. అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరి నంబర్లు వస్తే వారందరి ఫోన్లను ట్యాప్ చేసినట్టు తేలింది. ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తున్న ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న వారి సొంతంగా కూడా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కొందరు లీడర్లు డీజీపీని కలిసి తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు వివరించారు. అసలు ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ? ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు ? డేటాను ఎలా రికార్డు చేసేవారు? అనే దానిపై విచారణలో విస్తుపోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి. నాటి బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది నుంచే ఫోన్ ట్యాపింగ్ను అక్రమంగా వినియోగించడం మొదలుపెట్టినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పోలీసు శాఖ పరిధిలోనే కాకుండా.. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ సాయంతో ఒక ప్రైవేటు ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు తేల్చారు. ఎంక్వైరీలో వెల్లడవుతున్న ప్రతి విషయాన్ని అధికారులు రికార్డు చేస్తున్నారు.
ఢిల్లీని కూడా వదల్లేదు !
ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులు, వారి ఆఫీస్ సిబ్బంది, సన్నిహితులతో పాటు బీజేపీలోని ముఖ్యమైన లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఎంక్వైరీలో అధికారులు నిర్ధారణకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది? దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్లాలి ? అనేది ఆలోచించుకుని ప్రకటనలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో ఏయే వ్యాపార దిగ్గజాలు.. ఎలాంటి వ్యవహారాలు నడుపుతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ట్యాపింగ్కు పాల్పడినట్టు ఎంక్వైరీలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ను అస్త్రంగా వాడుకున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
ఇతర కేసులు పెట్టేందుకు సిద్ధం!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతర కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఇష్యూ ఒక్క ట్యాపింగ్కే పరిమితం కాలేదని అంటున్నారు. ఇల్లీగల్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపిస్తే తక్కువ శిక్ష, ఫైన్తో బయటపడేందుకు చాన్స్ ఉంటుందని తెలిపారు. అలా కాకుండా అక్రమ ట్యాపింగ్తో ఎలాంటి తప్పులు చేశారు? వాటి పర్యవసనాలు ఏమిటి? అనే దాని ఆధారంగా పెద్ద ఎత్తున కేసులు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు పోలీసు అధికారుల వరకే పరిమితమైన ట్యాపింగ్ వ్యవహారం.. త్వరలోనే బీఆర్ఎస్ లీడర్లు, మాజీ మంత్రుల మెడకు చుట్టుకోనున్నట్టు తెలిసింది. కొందరికి నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలుస్తారనే చర్చ నడుస్తున్నది.