
భద్రాచలం, వెలుగు : భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నారాయణ్పూర్ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన 10 ఐఈడీలను ఆదివారం బాంబ్ డిస్పోజల్ టీమ్స్ నిర్వీర్యం చేశాయి. ఎస్పీ ప్రభాత్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని కోహ్కెమేట పోలీస్స్టేషన్ పరిధిలో కుతుల్, ఖోడ్పర్, గుర్మాక గ్రామాల మధ్య రోడ్ల తనిఖీలకు డీఆర్జీ, ఐటీబీపీ 41వ బెటాలియన్ జవాన్లు, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ ఆదివారం వెళ్లాయి. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా తనిఖీలు చేస్తుండగా ఒక్కోటి ఐదు కిలోల బరువున్న 10 ఐఈడీలను గుర్తించి అక్కడే పేల్చివేశారు. జిల్లాలో ఇప్పటివరకు 33కి పైగా ఐఈడీలను గుర్తించామని ఎస్పీ తెలిపారు.