లొంగిపోయిన మల్లోజుల.. స్వయంగా సీఎంకు తుపాకీ అందజేసిన మావోయిస్ట్ అగ్రనేత

లొంగిపోయిన మల్లోజుల.. స్వయంగా సీఎంకు తుపాకీ అందజేసిన మావోయిస్ట్ అగ్రనేత

ముంబై: సీపీఐ (మావోయిస్టు) పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బుధవారం (అక్టోబర్ 15) మల్లోజుల సరెండర్ అయ్యారు. గడ్చిరౌలి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన లొంగుబాటు కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 60 మంది నక్సలైట్లు అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 

ఈ సందర్భంగా ఆయుధాలు వీడుతున్నట్లు మల్లోజుల ప్రకటించారు. స్వయంగా సీఎం ఫడ్నవీస్‎కు మల్లోజుల తుపాకీ సరెండర్ చేశారు. మొత్తం 54 ఆయుధాలను గడ్చిరౌలి పోలీసులకు అప్పగించారు మావోయిస్టులు. లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం రివార్డులు అందజేశారు. 

ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల వేణుగోపాల్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. దేశంలో మావోయిజానికి చోటు లేదని అన్నారు. నక్సల్  ఫ్రీ భారత్ నిర్మిస్తామన్నారు. 

జగిత్యాల జైత్రయాత్రతో విప్లవోద్యమంలోకి.. 

మల్లోజుల వేణుగోపాల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1956లో జన్మించారు. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కొడుకులు కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, వేణుగోపాల్ అలియాస్ సోను విప్లవోద్యమంలో కీలకపాత్ర పోషించగా, మరో కొడుకు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. 

వెంకటయ్య 1997లో మరణించగా.. తల్లి మధురమ్మ 2022లో కన్నుమూశారు. 2011లో వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్​జీ మరణించారు. కోటేశ్వర్​రావు, వేణుగోపాల్ జగిత్యాల జైత్రయాత్ర అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో వేణుగోపాల్ 1982లో అరెస్టయ్యారు. 1983లో విడుదలయ్యాక దండకారణ్యానికి వెళ్లారు. 

ఆ తర్వాత పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సీ) సెక్రటరీగా ఎదిగారు. 1995 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2010, జులైలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెప్తున్నాయి. 

ఆ తర్వాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ఈయన వ్యూహలు రచించారు. ఈ క్రమంలోనే ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను దళంలోనే పెండ్లి చేసుకున్నాడు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు.

ఆపరేషన్ కగార్‏తో ఉక్కిరిబిక్కిరి

కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ ప్రారంభించాక వందలాది మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో మరణించిన విషయం తెలిసిందే. దేశంలో 2026, మార్చి 31 నాటికి మావోయిస్టులే లేకుండా చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో పోలీస్ బలగాలు అడుగుపెట్టలేని అబుజ్ మాడ్ ఏరియాలోకి కేంద్ర భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి. 

ఇన్నాండ్లు షెల్టర్ జోన్‎గా భావించిన ప్రాంతాలన్నీ బలగాల చేతుల్లోకి వెళ్తుండడం, ఆరుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సహా అనేక మంది రాష్ట్ర, డివిజనల్ స్థాయి నేతలు చనిపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టంగా మారింది. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీసీ కలిసి సీపీఐ(మావోయిస్ట్)గా ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో 42 మంది సభ్యులుండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 13లోపే ఉంది. 

ఈ ఏడాదిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ ఎన్ కౌంటర్లలో అసువులుబాశారు. కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత ఏడాది రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ లాంటి కరుడుగట్టిన మావోయిస్టులు సైతం ఆయుధాలు వదిలి లొంగుబాటపట్టారు. 

ఇటీవల ఆయన ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్డ్స్ట్రగుల్అబాండెన్’విడుదల చేసిన 22 పేజీల లేఖ సెప్టెంబరు 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్రచర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. అంతేగాక వేణుగోపాల్ ను విప్లవ ద్రోహిగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది.