
మావోయిస్టులు వరుసగా ఆయుధాలను వదిలిపెడుతూ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. లేటెస్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత ఆశన్న పోలీసుల ముందు లొంగిపోయారు. బుధవారం (అక్టోబర్ 15) ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయిన ఆశన్న.. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోనున్నారు. .
ఆశన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావుది తెలంగాణలోని ములుగులు జిల్లా. 25 ఏండ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లి.. కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగాడు.
2027 వరకు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో.. అన్నట్లుగా భారీగా కూంబింగ్ లు నిర్వహిస్తోంది. ఆయుధాలు వదిలపెట్టాల్సిందేనని.. లేదంటే ఎవరినీ వదలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు కూడా. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ఆయుధాలు వదిలి వరుసగా లొంగిపోతున్నారు. ఇప్పటికే మావోయిస్టు సభ్యుడు మల్లోజుల బుధవారం (అక్టోబర్ 15) లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు.
అదే బాటలో ఆశన్న కూడా లొంగిపోనున్నారు. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాల అప్పగించనున్నారు. ఆశన్నతో పాటు 77 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇప్పటికే జగదల్పూర్కు చేరుకున్నారు.