
- ఛత్తీస్ గఢ్లో వరుస ఎన్ కౌంటర్లు, కీలక నేతలను కోల్పోవడంతో మారిన పంథా
- ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సరిహద్దు జిల్లాల్లో పోలీసుల హైఅలర్ట్
- వర్షాకాలంలోనూ ముమ్మర కూంబింగ్
- అటవీ గ్రామాల్లో వాల్పోస్టర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం
- మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికలు
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలతో సహా వందల మందిని కోల్పోయిన మావోయిస్టులు పంథా మార్చుకున్నారా? వర్షాకాలంలో కూంబింగ్ ఆపేస్తే కాస్త కుదురుకోవచ్చని భావించిన నక్సలైట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటనతో అడవులు వీడి, జనారణ్యంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇంటెలిజెన్స్వర్గాలకు ఈమేరకు ఉప్పందడంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉన్న అన్ని జిల్లాల్లో పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేశారు. అటవీ గ్రామాల్లో మావోయిస్టుల ఫొటోలతో వాల్పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడ్తూ గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అలాకాకుండా మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఆపరేషన్కగార్తో భారీ నష్టం..
వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రతినబూనిన కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అన్నంత పనీ చేస్తోంది. 2024 ఏప్రిల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక గడిచిన 18 నెలల కాలంలో 412 మంది మావోయిస్టులను కేంద్రబలగాలు హతమార్చాయి. ఈ ఏడాది ఇప్పటికే 14 భారీ ఎన్కౌంటర్లలో 203 మంది నక్సల్స్ కన్నుమూశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్, జయరాజ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబీ సెక్రటరీ గాజర్ల రవి, ఈస్ట్ జోన్ కమిటీ సెక్రటరీ అరుణ వంటి కీలక నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇలా వరుస ఎన్ కౌంటర్లలో వందలాది మావోయిస్టులతో పాటు కీలక నేతలను భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో మిగిలిన మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ముమ్మర కూంబింగ్.. గిరిజనులకు వార్నింగ్..
ఆపరేషన్కగార్తో చెల్లాచెదురైన మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర సరిహద్దు వెంబడి గోదావరి, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహాముత్తారం మండలాల్లోని దమ్మూరు, బూరుగూడెం, నీలంపల్లి, వెంచంపల్లి గ్రామాల వద్ద ఉన్న పెర్రీ పాయింట్లపై పోలీసులు నిఘా పెట్టారు. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి దాటే ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నదీ తీరం వెంబడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక రహదారుల వెంట వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.
అవసరమైన పత్రాలు, గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు, ముఖ్యంగా గొత్తికోయలు నివసించే అటవీగ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా గ్రామాల్లో మావోయిస్టుల ఫొటోలతో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫొటోల్లో ఉన్నవారు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటిస్తున్నారు. అదే సమయంలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అమిత్షా ప్రకటనతో షాక్..
ఈ వర్షాకాలంలోనూ కూంబింగ్ కొనసాగుతుందని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడం మావోయిస్టులను షాక్కు గురిచేసింది. నిజానికి ఎండాకాలంలో అడవులు పలుచబడ్డాక మావోయిస్టులను వేటాడే భద్రతాబలగాలు వర్షాకాలంలో కూంబింగ్ ఆపేస్తాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. అడవులు చిక్కబడితే భద్రతా బలగాలు ముందుకు కదలడం కష్టమవుతుంది. పురుగుపుట్రాతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంటుంది. అలాగే చిన్నచితక వాగులు అడ్డంకిగా మారుతాయి. దీంతో ఎప్పట్లాగే ఈ వర్షాకాలం కూంబింగ్ఆపేస్తారని, ఆలోపు కుదురుకోవచ్చని మావోయిస్టులు భావించారు.
కానీ, అమిత్ షా ప్రకటనను బట్టి చూస్తే అలాంటి పరిస్థితులు లేవని, మావోయిస్టులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనేది కేంద్రం వ్యూహంగా స్పష్టమవుతోంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రారంభం నుంచి జరుగుతున్న నష్టంతో మావోయిస్టులు కూడా తమ పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అడవుల్లో ఉండి భద్రతాదళాలకు చిక్కి పార్టీ మొత్తాన్ని కోల్పోయే కంటే జనారణ్యంలోకి వెళ్లి ఉద్యమాన్ని పునర్నిర్మించాలని మావోయిస్టు నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్కు పక్కా సమాచారం అందడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.