కొత్తగూడలో మావోయిస్టుల వాల్​ పోస్టర్ల కలకలం

కొత్తగూడలో మావోయిస్టుల వాల్​ పోస్టర్ల కలకలం

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడలో ఆదివారం మావోయిస్టు పార్టీ ఇల్లందు‌‌ ‌‌-నర్సంపేట ఏరియా కమిటీ పేరిట వాల్​ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పీఎల్​జీఏ 23వ వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుందామని మావోలు ఆ వాల్​ పోస్టర్​లో పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్గ పోరాటాన్ని, గెరిల్లా యుద్దాన్ని తీవ్రం చేద్దామని, వర్గ శత్రువులను నిర్మూలిద్దామని, ప్రజా పునాదిని మరింత బలోపేతం చేద్దామని ఆ వాల్​ పోస్టర్లలో  మావోలు పేర్కొన్నారు. శత్రువు కొనసాగిస్తున్న సూరజ్​కుండ్​ వ్యూహాత్మక దాడిని తిప్పికొడదామని, విప్లవోద్యమాన్ని విస్తరింపచేస్తూ పురోగమిద్దామని కోరారు. కాగా, 15 రోజుల వ్యవధిలో కొత్తగూడలో రెండుసార్లు మావోల కరపత్రాలు, వాల్​ పోస్టర్లు వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు. వాల్ పోస్టర్లను పోలీసులు తొలగించారు.