ఎన్నికల్లో విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

ఎన్నికల్లో విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్
  •     మందుపాతరలు అమర్చి పోలీసులను చంపే కుట్ర 
  •     ఆరుగురు సానుభూతిపరులు అరెస్ట్ 

వెంకటాపురం, వెలుగు :  రాబోయే ఎన్నికల సందర్భంగా అడవిలోకి కూంబింగ్​కు వచ్చే పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చడానికి వస్తున్న ఆరుగురు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్​గఢ్​దండకారణ్యం నుంచి కొందరు మావోయిస్టు సానుభూతిపరులు గురువారం సరిహద్దుల్లోని సూరవేడు (కొత్తపల్లి క్రాస్) వద్ద మందుపాతరలు అమర్చడానికి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిలో చత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లా ఉసురు బ్లాక్, పూజారి కాంకేట్, ఊట్లపల్లి గ్రామాలకు చెందిన తాటి అర్జున్, సోడి వీరయ్య , సోడి గోపి, సోడి రామయ్య , తాటి రమేశ్, సోడి నాగేశ్​ ఉన్నారని వెంకటాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు. వీరి నుంచి12 జిలెటిన్ స్టిక్స్-, 2 డిటోనేటర్లు, 4 బ్యాటరీలు-, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్-, 2 టిఫిన్ బాక్సులు, ఎన్నికలను బహిష్కరించాలంటూ ముద్రించిన పాంప్లెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరంతా గతంలో మావోయిస్టు సానుభూతిపరులుగా ఉండి జైలు జీవితం గడిపివచ్చారన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు కొప్పుల తిరుపతి, రేఖ, అశోక్ పాల్గొన్నారు.