హైదరాబాద్, వెలుగు: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి సూచనలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ చేపట్టారు.
మొత్తం 7,329 పత్తి బస్తాల్లో 59 బస్తాలు తడిచినట్లు విచారణలో తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజు కొనుగోలు చేశారు. విచారణ నివేదిక ప్రకారం.. రైతులకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ నివేదికను మార్కెటింగ్ డైరెక్టర్ మంత్రికి సమర్పించారు.
