పరీక్షల్లో మంచి మార్కులు వస్తేనే ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయని…కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలపై ఒత్తిడికి గురిచేస్తుంటారు. ముఖ్యంగా కలెక్టర్ కావాలంటే చదివే అన్ని సబ్జెక్టుల్లో భాగా మార్కులు రావాలంటుంటారు. దీంతో పిల్లిలు కూడా అదే ఆలోచనాదోరణిలో ఉండిపోయి…మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే మార్కులతో అవసరం లేదని విషయ పరిజ్ఞానం ఉంటే చాలని నిరూపించారు ఓ IAS అధికారి. ఆయనే నితిన్ సంగ్వాన్.
ప్రస్తుతం అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట్ సిటీ సీఈవో గా ఉన్నారు నితిన్ సంగ్వాన్. లేటెస్టుగా ఆయన తన ఇంటర్ మెమోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీబీఎస్ఈ ఇంటర్లో రసాయన శాస్త్రంలో ఆయనకు 24 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆ సబ్జెక్టులో 23 మార్కులు వస్తే పాస్ అవుతారని, తనకు పాస్ మార్కుల కంటే ఒక్క మార్కు మాత్రమే ఎక్కువ వచ్చిందని చెప్పారు.
అయినప్పటికీ తన జీవితంలో తాను ఏం కావాలనుకుంటున్నానో దాన్ని ఈ మార్కులు నిర్ణయించలేదని తెలిపారు. మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని ఇబ్బంది పెట్టవద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. పరీక్షల ఫలితాల కంటే జీవితం చాలా విలువైనదని చెప్పారు. సీబీఎస్ఈ ఇంటర్, టెన్త్ ఫలితాలను విడుదల చేస్తోన్న సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.