వరంగల్, వెలుగు: వరంగల్ కోర్టుకు సోమవారం మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం కోర్టులో బాంబ్ పేలుస్తామని తెలిపారు. ఉదయం 11 గంటలకు కేసులు చూసేందుకు జడ్జీలు, న్యాయవాదులు, వివిధ కేసుల్లో ఉన్నవారితో కోర్టులో బిజీ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కోర్టు అధికారులకు బాంబు ఉన్నట్టు మెయిల్ వచ్చింది. న్యాయవాదులు కోర్ట్ గదుల నుంచి ప్రాంగణంలోకి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అధికారుల సమాచారంతో స్థానిక సుబేదారి పోలీసులతో పాటు బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబులు లేవని తేల్చిచెప్పారు. వరుస బెదిరింపులతో అందరిలో టెన్షన్ నెలకొంది. ఏడాది కింద ఓసారి, జూన్ 21న, ఈ ఏడాది ఫిబ్రవరి 26న, మార్చి 18, మార్చి 30, సోమవారం మరోసారి వరుస బెదిరింపులు రావడంతో మొత్తంగా ఆరుసార్లు ఆందోళన తప్పలేదు.

