హైదరాబాద్, వెలుగు:మారుతి సుజుకి ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా డెలివరీలను హైదరాబాద్లో శనివారం ప్రారంభించింది. కస్టమర్లకు 108 కార్లను అందజేసింది. ఇప్పటికే 44 దేశాలకు 25 వేలకుపైగా యూనిట్లను ఎగుమతి చేశారు. భారత్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్లో ఈ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీపై ఎనిమిది ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీని సంస్థ అందిస్తోంది. హైదరాబాద్లోని 21 నెక్సా వర్క్షాప్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 54 కేంద్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సర్వీసింగ్ సౌకర్యం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంది. కస్టమర్లను ఆకర్షించేందుకు మారుతి సుజుకి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50 వేల విలువైన చార్జర్ , ఇన్స్టాలేషన్, ఏడాది చార్జింగ్ ఉచితంగా ఇస్తారు. 2030 నాటికి లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యమని, ఈవీల విభాగంలో హైదరాబాద్ 14.5 శాతంతో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్) పార్థో బెనర్జీ చెప్పారు. యుద్ధం కారణంగా తమ కార్ల ధరలు పెరగవచ్చని తెలిపారు.
